కరోనా వైరస్ చైనాలో మొదలై ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 17 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో రష్యా అప్రమత్తమైంది. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా చైనాతో సరిహద్దును మూసివేసేందుకు సిద్ధమైంది. ‘చైనాతో సరిహద్దును మూసివేసే చర్యలపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి’ అని రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ అధికారిక సమావేశంలో వెల్లడించారు.
ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 170 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు. భారత్ జపాన్, అమెరికా, కెనడా, శ్రీలంక, టిబెట్ తదితర దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా దేశాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వైరస్ కారణంగా భారత్ సహా పలు దేశాలకు చైనాకు విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. చైనాలో ఉన్న తమ పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లేందుకు భారత్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.