తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ప్రభుత్వం.. ఇటు కార్మికులు పట్టు విడవడం లేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం బస్సుల్లేక తమ గమ్య స్థానానికి చేరుకునే మార్గం తెలియక తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మలక్పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ప్రయాణికులు తిరగబడ్డారు.
నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద గంటల తరబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న సామాన్య జనం ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు కోపోద్రుక్తులయ్యారు. నడిరోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను నిలిపి వేసి రాస్తారోకో నిర్వహించి తమ నిరసన, ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీల మొండి వైఖరికి తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు.