తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కారణంగా ఓ వైపు ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది. పండుగ సమయంలో లాభమార్జించే అవకాశం ఉన్నప్పటికీ సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీ ఆదాయాన్ని క్యాబ్లు, ఆటోరిక్షాలు, ఎంఎంటీఎస్, మెట్రోరైలు , ఇతర ప్రైవేటు ఆపరేటర్ల పరమవుతున్నది. త్రిసభ్య కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టారు.
హైర్ బస్సులతోపాటు, ప్రైవేటు బస్సులు, మ్యాక్సీక్యాబ్లు, పర్యాటకశాఖ, విద్యాసంస్థల బస్సులను రంగంలోకి దించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. సమ్మె నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అద్దె బస్సులతోపాటు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నారు.