తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యానికి యత్నించి ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని అన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని పిలుపునిచ్చారు.
మొండి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పోరాడుదామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహులతో మాట్లాడిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఉద్యమ ద్రోహులు తలసాని, ఎర్రబెల్లి రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా కేసీఆర్.. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు.