లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ మార్చి 22న లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో 57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కుతున్నాయి.
బస్సుల్లో పాత చార్జీలే వసూలు చేస్తారు. ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదు. రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి.
సూర్యాపేట డిపో నుంచి 78 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. 54 సీటింగ్ కెపాసిటీతో ప్రయాణికులను తీసుకువెళ్లాలని డ్రైవర్ కండక్టర్లకు సూచించారు. శ్రీశైలం మినహా అన్ని రూట్లలో బస్సులు నడపాలని డిపో అధికారులు నిర్ణయించారు. నల్లగొండ రీజియన్లో 400 బస్సులు రోడ్డెక్కాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి వచ్చే బస్సులు హయత్నగర్ వరకు రానున్నాయి. హైదరాబాద్కు వచ్చే బస్సులన్నీ నగర సరిహద్దుల్లోనే నిలిచిపోతాయి. జేబీఎస్, హయాత్నగర్, ఉప్పల్, ఆరాంఘర్ నుంచి మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులను జేబీఎస్ వరకే రానున్నాయి.