telugu navyamedia
ఆరోగ్యం

ఐఐటీ ప్రొఫెసర్ రూపకల్పన … 5 సెకన్లలో ఎక్స్ రే ద్వారా కరోనా వైరస్ గుర్తింపు

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కరోనా వైరస్ నిర్మూలనకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా కరోనా వైరస్ సోకిందా లేదా అనేది తెసుకోవడానికి 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. పైగా రూ నాలుగునుంచి ఐదువేలదాకా ఖర్చు అవుతోంది. ఈ కారణంగా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితుల్లో ఐఐటి-రూర్కీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం 5 సెకన్లలో కరోనా వైరస్ ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ తో ఎక్స్ రే స్కాన్ ఉపయోగించి 5 సెకన్లలో వైరస్ ఉనికిని గుర్తించవచ్చని ఆయన వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఎక్స్‌రే చిత్రాల ద్వారా రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. అలాగే ఇన్ ఫెక్షన్ తీవ్రతనూ వివరిస్తుందన్నారు. 5 సెకన్ల ప్రక్రియతో ఫలితం తేలుతుందన్నారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి నలబై రోజులు పట్టిందని ప్రొఫెసర్ కమల్ జైన్ తెలిపారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను విశ్లేషించిన తర్వాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఈ సాఫ్ట్ వేర్ తో ప్రాథమిక పరీక్ష చేసి పక్కాగా గుర్తించేందుకు క్లినికల్ టెస్టు చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా కారక ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తుల్లో కొద్ది భాగంలోనే ఉండగా కరోనా ప్రభావం మరెంతో తీవ్రంగా ఉంటుంది. బైలాటెరల్ ఒపాసిటీ, ఊపిరితిత్తుల్లోని ద్రవం, ఏమైనా గడ్డకట్టాయా వంటివీ దీనిద్వారా తెలుసుకోవచ్చు. అమెరికాలోని అమెజాన్ విశ్వవిద్యాలయం సైతం ఇలాంటి ప్రయోగమే చేసింది కానీ విజయవంతం అవ్వలేదని కమల్ తెలిపారు.

Related posts