telugu navyamedia
క్రీడలు వార్తలు

గంగూలీ మాటను లెక్కచేయని రోహిత్…

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు. ఫిట్‌నెస్‌ లేదంటారా… అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అనే మొండితనాన్ని హిట్ మ్యాన్ చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయరా? అని తన అభిమానులు బీసీసీఐని నిలదిసేలా వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలోనే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే గంగూలీ.. ఈ ఒక్క లీగ్‌ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని రోహిత్‌కు సూచించాడు. రోహిత్‌ లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. కానీ హిట్‌మ్యాన్ ఏకంగా మ్యాచే ఆడి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్‌ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా దాదా సలహా ఇచ్చిన రోజే రోహిత్‌ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును అపహాస్యం చేశాడు. గాయంతో ముంబై ఇండియన్స్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌ మంగళవారం ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడి అందర్నీ షాక్ గురి చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ…తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన అక్టోబర్‌ 26 నుంచి రోహిత్‌ గాయంపై దుమారం రేగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రోహిత్‌ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం మరింత గందరగోళానికి గురి చేస్తోంది. రోహిత్‌ను ఎంపిక చేయని రోజు నుంచి ముంబై ఇండియన్స్, రోహిత్‌ శర్మ ఏదో రూపంలో బోర్డుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. టీమ్‌ సెలక్షన్‌ ముగిసిన తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో, కోచ్‌ రవిశాస్త్రి…రోహిత్‌ ఫిట్‌గా లేడని చెప్పిన రోజున మరో వీడియో, ఇప్పుడు గంగూలీ వ్యాఖ్య తర్వాత నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగి బోర్డుకు సవాల్ విసురుతున్నారు.

Related posts