అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో రెండు సిక్సర్లు బాదటంతో రోహిత్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అడిలైడ్ వన్డేలో మొత్తం 52 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ రెండు సిక్సర్లతో కలిపి ఆసీస్ జట్టుపై రోహిత్ నమోదు చేసిన సిక్సర్ల సంఖ్య 89కి చేరుకుంది.
గతంలో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఇంగ్లండ్ జట్టుపై 88 సిక్సర్లు కొట్టాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఇప్పటి వరకు గేల్ పేరు అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రోహిత్ 89 సిక్సర్లతో అతడిని వెనక్కి నెట్టాడు. 31 ఏళ్ల రోహిత్ తన 12 ఏళ్ల కెరియర్లో ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడగా 210 సిక్సర్లు కొట్టాడు. ఇందులో 89 కంగారూలపైనే కావడం గమనార్హం. అడిలైడ్ లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నిర్ణిత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి ఇండియా 299/4, ఆస్ట్రేలియా 298/9.