దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువుగా భావించే ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో పర్యాయం బాధ్యతలు స్వీకరించారు. 58 మందితో క్యాబినెట్ కూడా కొలువుదీరింది. జూన్ 17న పార్లమెంటు సమావేశాలకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో, తాజా లోక్ సభలో అత్యంత ధనికుడు ఎవరన్న చర్చకు వస్తే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కుమారుడు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నకుల్ నాథ్ లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.
బీజేపీ అభ్యర్థి నాథన్ షా కవ్రేటీపై 37,536 ఓట్లతో గెలిచారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం నకుల్ నాథ్ ఆస్తుల విలువ రూ.660 కోట్లు. ఇప్పుడు కొలువుదీరనున్న లోక్ సభలో నకుల్ నాథ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఏడాదికి రూ.2.76 కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నారట. బీజేపీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నలుగురు అత్యంత పేద ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో రూ.4 లక్షలుగా పేర్కొన్నారు.