జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి తాజాగా ఒక వాంగ్మూలాన్ని విడుదల చేశారు. మొత్తం నాలుగు పేజీల వాంగ్మూలాన్ని రియా తరపు న్యాయవాది తాజాగా మీడియాతో పంచుకున్నారు. ఆ వాంగ్మూలం ప్రకారం… ‘‘సుశాంత్ కుటుంబం చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు, కట్టుకథలు. రియా తనకు సంబంధించిన అన్ని ఆర్థికపరమైన పత్రాల్ని, ఐటీ రిటర్నులను ముంబై పోలీసులకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సమర్పించారు. వాటిలో ఏ విధమైనటువంటి అవకతవకలు లేవని వారు తేల్చిచెప్పారు. 2019 ఏప్రిల్లో రియా ఒకసారి సుశాంత్ ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి అతడి సోదరి ప్రియాంక, బావ సిద్దార్థ అక్కడే ఉంటున్నారు. ఒకరోజు రియా, ప్రియాంక కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అక్కడ ప్రియాంక మద్యం అధికంగా సేవించి.. అందరితోనూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో రియా ఆమెను తీసుకుని ఇంటికి వచ్చేశారు. ఆరోజు రాత్రి నిద్రలో ఉన్న రియా పక్కకు చేరిన ప్రియాంక, ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించారు. నిద్ర నుంచి మెలకువ వచ్చిన రియా, ప్రియాంకను చూసి షాక్ అయ్యారు. వెంటనే హెచ్చరించి గది నుంచి బయటికి పంపారు. ఈ విషయం తెలిసి సుశాంత్ ప్రియాంకతో గొడవ పడ్డారు. అప్పటి నుంచీ రియాకు, సుశాంత్ కుటుంబానికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. బిహార్ పోలీసుల విచారణ కారణంగా కేసు పూర్తిగా రాజకీయం అయిందని రియా ఆందోళన చెందుతున్నారు. ఆదిత్య ఠాక్రే గురించి వినడమే తప్ప రియా ఆయనను ఎన్నడూ కలవలేదు’’ అని ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. కేసు విచారణలో ఉండగా.. రియా తనకు తానే తప్పు చేయలేదంటూ ధ్రువపత్రం ఇచ్చుకోవడం సరికాదని సుశాంత్ కుటుంబం తరపు న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. కాగా.. సుశాంత్ మృతికి సంబంధించి 15కోట్ల మనీ లాండరింగ్ కేసు విషయంలో అతడి తండ్రి కేకే సింగ్ వద్ద ఈడీ వాంగ్మూలం సేకరించింది.
previous post