హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు ఓ బైకు సంస్థ అందుబాటులో అద్దె బైకులను ఏర్పాటు చేసింది. బెంగళూరు మెట్రో రైలు తరహాలో నగరంలో బౌన్స్ అద్దె బైకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం నగర ట్రాఫిక్ పోలీస్ ఆదనపు కమిషనర్ అనిల్కుమార్ బౌన్స్ అద్దె బైకు సేవలను ప్రారంభించారు. ముందుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్లలో ప్రారంభమైన అద్దె బైకుల సేవలను హైటెక్ సిటీ, జూబ్లీ చెక్పోస్టు, సీబీఎస్ ఇలా దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.టు వీలర్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి.. మొబైల్ స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతిఒక్కరూ బౌన్స్ అద్దె బైకుల సేవలను వినియోగించుకోవచ్చు.
ముందుగా బౌన్స్ సేవలు వినియోగించుకునే వారు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెర్స్ టెక్నాలజీ సహాయంతో బౌన్స్ సంస్థ టీవీఎస్ జెస్ట్, టీవీఎస్ పెప్ మోటార్ బైకులను నడుపుతోంది. నగరంలోనే ఎక్కడైనా బైకును అద్దెకు తీసుకొని మన గమ్యానికి చేరుకున్నాక, పబ్లిక్ పార్కిం గ్ ప్రదేశంలో బైకును వదిలేసి వెళ్లోచ్చు. తిరిగి ఆ బైకు ను అద్దెకు తీసుకున్న ప్రదేశంలో అప్పగించాల్సిన పనిలేదు. తాళం వేయాల్సిన పనికూడా లేదు. మొబైల్ ఉన్న యాప్ ద్వారా మన ట్రిప్ ముగిసినట్లు తెలియజేస్తే చాలు. బౌన్స్ కంపెనీ ప్రతినిధులే ఆన్లైన్లో బైకును లాక్ చేస్తారు. ఇక ఆ ప్రదేశంలో మరొకరు అదే బైకును తీసుకొని తమ రైడ్ను ప్రారంభించవచ్చు.