ఇప్పటికే ‘జియో’తో హాల్ చల్ చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి తెర తీసింది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్తో జత కట్టింది. భారత డిజిటల్ రూపును దేదీప్యమానంగా వెలిగించేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు.
భారతీయ టెక్నాలజీ స్టార్టప్లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్ను ఉచితంగానే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ వెల్లడించారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్ను నెలకు కేవలం రూ.1500కే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.