రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ త్వరలోనే ఆన్లైన్ రిటైల్ రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 నాటికి 50లక్షల రిలయన్స్ రిటైల్ స్టోర్లు పూర్తి డిజిటల్ దుకాణాలుగా మారతాయిని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే 15వేల రిలయన్స్ రిటైల్ దుకాణాలు పూర్తి స్థాయి డిజిటలైజేషన్తో పనిచేస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 90శాతం అంటే 700 బిలియన్ డాలర్ల రిటైల్ మార్కెట్ వ్యవస్థీకృతంగా లేదు. తమ ఇంటి పక్కన దుకాణంలోకి వెళ్లి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి తెచ్చుకునే వారి సంఖ్యే ఎక్కువ. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆధునీకరించబడతాయని అధ్యయనం తెలిపింది.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు చేయడం వల్ల అందుకు తగిన విధంగా బిల్లులు ఇవ్వాలంటే తప్పకుండా ఆధునీకరించాల్సి ఉంటుంది అని నివేదిక తెలిపింది. దేశ వ్యాప్తంగా 10వేల రిలయన్స్ రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆన్లైన్ టు ఆఫ్లైన్ ఇ-కామర్స్ వేదికను ఏర్పాటు చేయాలని చూస్తోంది. రిలయన్స్ దుకాణాల్లో అత్యధిక వేగం కలిగిన 4జీ జియో ఎంపీఓఎస్(మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్) పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా సమీపంలోని దుకాణదారులు వినియోగదారులకు కావాల్సిన వస్తువులను వేగంగా అందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది.
ఎంపీఓఎస్ల విషయానికి వస్తే, స్నాప్బిజ్ ఒక్కో మెషీన్కు ఒకసారి పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాల్సి వస్తుండగా, రిలయన్స్ జియో ఎంపీఓఎస్ కేవలం రూ.3వేలకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా నుక్కడ్ షాప్స్ ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.55వేలు, గోఫ్రుగల్ రూ.15వేల నుంచి రూ.లక్ష వరకూ ఎంపీఓఎస్కు తీసుకుంటున్నాయి.