*కృష్ణం రాజు అంత్యక్రియలు పూర్తి..
*చితికి నిప్పంటించిన ప్రభాస్ సోదరుడు ప్రభోద్
*కడసారి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు
అశ్రునయనాల మధ్య రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూరైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్హౌస్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని అంతిమయాత్రగా జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద నుంచి మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు .
మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ముగిసాయి.హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీద కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున కనకమామిడి ఫాంహౌస్ కు చేరుకున్నారు.
కృష్ణం రాజు జనవరి 20, 1940న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు.
కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కృష్ణంరాజు విద్యాభ్యాసం మొగల్తూరులో మొదలైంది. ఆ తర్వాత హైదరాబాద్ భద్రుకా కాలేజీ ఆఫ్ కామర్స్లో చేరారు. పి.యు.సి పాస్ అయ్యాక బీకామ్ చేశారు.
చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
ఆ తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించిన కృష్ణం రాజు… కథానాయకుడిగా మళ్ళీ తెలుగు తెరపై అడుగు పెట్టడం కోసం నిర్మాణంలోకి ప్రవేశించారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు.