రైతుకు మేలు జరిగేలా అనంతపురంలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిలాల్లో అత్యధిక మంది రైతులు వేరుశనగ పంట సాగు చేశారని, ప్రస్తుతం మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు క్వింటాకు రూ.5,090 ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రస్తుతం మార్కెట్లో క్వింటా వేరుశనగ రూ.4 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని, రైతులెవరూ తొందరపడి పంటను దళారులకు విక్రయించవద్దని కోరారు. జిల్లాలో 16 మార్కెట్యార్డులు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కమిటీలకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ అమలు చేసినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఓ మార్కెట్యార్డు ఏర్పాటు చేస్తుండగా.. గుంతకల్లు, కదిరిలో మాత్రం రెండేసి చొప్పున మార్కెట్యార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.