రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, టెండర్ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు 2020, జనవరి 22వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ జరిగింది. 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 647 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
బోధన్ 32వ వార్డులోని 87, మహబూబ్ నగర్ మున్సిపల్ లోని 41 వార్డులోని 198, కామారెడ్డి 41 వార్డులోని 101 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు ఇది వరకే ప్రకటించినట్లుగా 2020, జనవరి 25వ తేదీన చేపడుతారు.