ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభించిన తరువాత తొలుత మూడు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన ఆర్బీఐ ఆపై దాన్ని మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఇప్పటికీ చాలా రంగాలు లాక్ డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో మరోసారి ఆర్బీఐ మారటోరియాన్ని పొడిగించనున్నట్లు తెలుస్తోంది. అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.