వైసీపీ కంచుకోట రాయచోటిలో ఈ సారి మైనార్టీలు పాగ వేయనున్నారు. అత్యధికంగా ముస్లిం ఓటర్లున్నా ఈ నియోజకవర్గంలో వైసీపీకి ముస్లిం వర్గాలు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డికి ఈ సారి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. పులివెందుల తర్వాత వైసీపీకి అత్యంత ఆదరణ ఉన్న నియోజకవర్గం రాయచోటి. ఇందుకు కారణం ముస్లిం ఆదరణ పార్టీకి ఉండడమే. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకే నియోజకవర్గ ఓటర్లు నీరాజనం పలుకుతూ వస్తున్నారు.
2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్రెడ్డికి దాదాపు 60 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్రెడ్డి పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగిపోయింది. అదేవిధంగా 2014 ఎన్నికల్లోనూ శ్రీకాంత్రెడ్డి సుమారు 40 వేల మెజార్టీతో గెలుపొందారు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో రాయచోటి నియోజకవర్గం అంటేనే.. వైసీపీ కంచుకోట అనే రీతిలో పేరు నిలిచిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ముస్లిం మైనార్టీల నుంచి షాక్ తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు ఆవేదన చెందుతున్నారు. తమకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డికి ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని యువకులు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం వ్యవహార శైలితో మనోభావాలు దెబ్బతిన్న మైనార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డికి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న ప్రముఖ బంగారు వ్యాపారి అల్లాబకాష్ను పలువురు మైనార్టీలు బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు గౌరవం ఇచ్చే పార్టీకే అండగా ఉందామనే ఆలోచనలో మైనార్టీలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.