ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. కాగా గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం విదితమే. పరారీలో ఉన్న రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు ఆయన గడువు కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్ ఈ మెయిల్లో తెలిపారు.
అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు.