సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఆయనను కుట్రపూరితంగా లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు ముమ్మర విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు సమన్లు జారీ చేసింది.
దీనిపై చర్చించేందుకు ఈ మూడు సంస్థల చీఫ్ లు ఈరోజు న్యాయమూర్తుల ఛాంబర్ కు రావాలని ఆదేశించింది. మరోవైపు, డబ్బు తీసుకుని తీర్పు చెప్పించే దళారీ వ్యవస్థకు రంజన్ గొగోయ్ చెక్ పెట్టినందుకే ఆయనను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ బైంసా అనే లాయర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పడంతో ఆధారాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆయనకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ వ్యవహారం పై జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ఈ ఆరోపణలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత విషయంలో పెను సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు జస్టిస్ గొగోయ్ సిద్ధపడటం గొప్ప విషయమని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని ప్రశంసించారు.