సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం రోజున విజయవాడ నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా అని తన ట్వీట్లో తెలిపారు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మిగతా అంతటా మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రోజున విజయవాడ నావాటెల్ హోటల్లో ప్రెస్మీట్ నిర్వహిస్తున్నట్టు వర్మ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.
లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం,కానీ ఆ హోటల్ వాళ్లకి ఎవరో వార్నింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలో పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నానని తెలిపారు. మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ అభిమానులకు, ప్రజలందరికీ మీటింగ్ లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ వర్మ తన ట్వీట్లో తెలిపారు.