telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నూర్ మహమ్మద్ కుటుంబానికి 10 లక్షల విరాళం ప్రకటించిన చరణ్

Charan

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహ్మద్ ఈరోజు ఉదయం గుండెపోటు‌తో మరణించారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నూర్ మహ్మద్ తన వీరాభిమాని అని, ఆయన మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో ఆదివారం వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్‌ ఒక ప్రకటన చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ‘‘నూర్‌ మ‌హ‌మ్మ‌ద్‌గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ మ‌హ‌మ్మ‌ద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని రామ్‌చ‌ర‌ణ్ త‌న సంతాపాన్ని ప్రకటించారు.

Related posts