కేంద్రమంత్రి, భాజపా నేత రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ నుంచి విముక్తి పొందినప్పుడే దేశంలో పేదరికాన్ని నిర్మూలించవచ్చని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లోని హావ్ఢా ప్రాంతంలో భాజపా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎన్నికల నేపథ్యంలో పేదరిక నిర్మూలన అంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీలపై విమర్శలు గుప్పించారు. ‘జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ.. పేదరిక నిర్మూలన కోసం హామీలు ఇస్తూనే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే హామీ ఇస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ నుంచి దేశం ఎప్పుడు విముక్తి పొందుతుందో అప్పుడే పేదరికం తొలగిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
‘బెంగాల్లో ప్రజాస్వామ్య ఉనికి కనపడట్లేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపై హింస కొనసాగుతోంది.. ఇది ప్రజాస్వామ్యానికి సూచికా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి ఏర్పడే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రాష్ట్రంలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 3 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది.