వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నటుడు అలీ వైసీపీలో చేరిపోగా, మరో సినీ నటుడు రాజారవీంద్ర నేడు అదే బాటలోనే నడవనున్నారు. నేడు జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకోనున్నారు. ఇదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, తోట నరసింహం, మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
గడచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లో ఉంటూ, పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానిస్తూ, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న జగన్, నేడు దాదాపు 75 మందితో తొలి జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆపై మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఫైనల్ చేసి, ప్రచారానికి వెళ్లనున్నారు.