telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో.. రైతు బందు+.. పథకం.. త్వరలో ఆమోదం…

Chandrababu comments Jagan cases

రైతు బందు పథకంతో హిట్ కొట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆ పథకం ప్రస్తుతం అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఏపీ రాష్ట్రం కూడా చేరింది. అయితే ఏపీలో ఇంకాస్త మెరుగ్గా ఈ పథకాన్ని రైతులకు అందించేందుకు సీఎం కృషిచేస్తున్నట్టు సమాచారం. ఏపీలో కూడా, రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. తెలంగాణలో ‘రైతు బంధు’ పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. దీనికంటే మెరుగ్గా… భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం! వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.

ఏపీలో ఈ పథకం కింద, ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా… కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ‘పెట్టుబడి సాయం’ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే… సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు సాయం చేయడంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్నామని… వారిని మరింతగా ఆదుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని… ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

Related posts