మహిళలకు కఠినమైన బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఆయా విభాగాలలో వారిని నిలువరించే యోచనలో ఉంది. దానిలో భాగంగా, కఠినమైన, అనుకూల పని వాతావరణం లేని కొన్ని ఉద్యోగాల్లో మహిళలను తీసుకోకపోవడమే మంచిదని భారత రైల్వేశాఖ భావిస్తోంది. డ్రైవర్లు, పోర్టర్లు, గార్డులు, ట్రాక్మెన్ లాంటి పోస్టుల్లో కేవలం పరుషులనే తీసుకునేలా అనుమతి ఇవ్వాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ విభాగానికి లేఖ రాసింది. ఇటువంటి ఉద్యోగాల్లో మహిళలకు సరైన భద్రత లేకపోవడమేగాక, కఠినమైన పనులు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.
రైల్వే శాఖలో 13లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 2 నుంచి 3 శాతం మాత్రమే. వీరిలో చాలా మంది డెస్కుల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తుండగా.. డ్రైవర్, గార్డులు, పోర్టర్లు, ట్రాక్మెన్ల పోస్టుల్లోనూ కొందరు మహిళలు ఉన్నారు. అయితే మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కానీ కొన్ని పోస్టుల్లో విధుల సమయంలో వీరికి సరైన భద్రత ఉండట్లేదని, పని వాతావరణం కూడా సానుకూలంగా లేదని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది. అందుకే ఇలాంటి పోస్టుల్లో పురుషులను మాత్రమే తీసుకోవాలని యోచిస్తోంది.
రైల్వేల్లో మహిళలకు సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. అందుకే మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సుముఖంగా లేదు. మహిళలను తీసుకోకుండా ఉండే బదులు.. వారికి సదుపాయాలను మెరుగుపరిస్తే బాగుంటుంది.. అని ఉద్యోగ యూనియన్ సభ్యులు చెబుతున్నారు.
ప్రజావేదికను కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగం: కేశినేని నాని