కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూ.72,000 జమ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘కనీస ఆదాయ భరోసా’ పథకం ద్వారా పేదలకు చెందే లబ్ది గురించి వివరించారు. భారత దేశంలో 20 శాతం మంది పేదలు అంటే, ఐదు కోట్ల కుటుంబాల్లో 25 కోట్ల మంది పేదలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అన్నారు.
ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా ఏడాదికి రూ.72,000 జమ చేస్తామని, ఇందుకు సంబంధించిన అన్ని గణాంకాలను సరి చూసుకున్నామని రాహుల్ తెలిపారు. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదని తెలిపారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందని రాహులు పేర్కొన్నారు.