దేశంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ లేఖ రాశారు.కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అండగా ఉంటామని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. లాక్డౌన్ రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, లాక్డౌన్తో పట్టణాల యువత గ్రామాల బాటపట్టారన్నారు. దీని వల్ల గ్రామాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వృద్ధులను కాపాడుకుంటూనే యువకులను హెచ్చరించాలని సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు. లాక్డౌన్ చాలా పరిశ్రమలు మూసివేసినందున కార్మికులు ఇబ్బందులు పడకుండా తక్షణ ఆర్థిక సహాకారం అందించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన రాహుల్ ఒక మంచి పరిణామమన్నారు. అయితే ఆర్థిక ప్యాకేజిని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలన్నారు.