ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల రాజకీయంగా బాగాపరిణతి చెందారు. ఎక్కడ ఏవిధంగా విమర్శించాలో బాగా అర్ధం చేసుకున్నారు. ప్రత్యర్థుల పై అస్త్రాలు సంధిస్తున్నారు. దీనితో ఆ పార్టీ వర్గాలలో రాహుల్ సిద్ధం అయ్యాడనే దృఢనమ్మకానికి వచ్చేశారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మాట్లాడిన వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చి, లక్నోలో ర్యాలీ నిర్వహించిన వేళ, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్, నవ్వులు పూయించారు. మోదీ చెయ్యి ఎలా తిప్పుతారు? ఆయన శరీర కదలికలు ఎలా ఉంటాయో అనుకరిస్తూ చూపించారు.
“గతంలో నరేంద్ర మోదీ ఇలా మాట్లాడేవారు… ఇలా… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు” అంటూ మోదీ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేశారు. “సోదర సోదరీమణులారా… అనిల్ అంబానీ ఎవరో నాకు తెలియదు. ఆయనకు నేను ఎన్నడూ 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు” అని ఆయన అంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా, రాహుల్ గాంధీ ప్రధానిని అనుకరించడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవల తన భోపాల్ పర్యటన సందర్భంగానూ ఆయన మోదీ గొంతును మిమిక్రీ చేశారు. ఇటీవల ఒక జాతీయ పత్రిక రాఫెల్ పై నిబంధన మార్పులు జరిగినట్టు స్పష్టంగా చెప్పడంతో మరోసారి ఈ కుంభకోణంపై చర్చలు, విమర్శలు తెరపైకి వస్తున్నాయి.