కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడినా కూడా ఈసారి మరింత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల కోసం ముందస్తుగా మేల్కొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని పహాడీ షరీఫ్లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. గతంలోని తప్పులు పునరావృతం కాకూడదని భావిస్తున్న కాంగ్రెస్.. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడీ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్.. తన పార్టీ విధివిధానాలను ప్రకటించనుంది.
రాహుల్ పర్యటన తర్వాత మరింత దూకుడు పెంచాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సభ చేవెళ్ల లో జరుగుతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన ఏర్పాట్లను అక్కడి సిట్టింగ్ ఎంపీ చూస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.