భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ చిగురుటాకులా వణికిపోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు వయనాడ్ జిల్లాకు వెళ్లి, వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రధాని మోదీతో తాను మాట్లాడానని… వరద బీభత్సం సృష్టిస్తున్న ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలను తీసుకోవాలని కోరానని రాహుల్ తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రధాని చెప్పారని అన్నారు.
కేరళలో వరద సరిస్థితిని తాను నిశితంగా గమనిస్తున్నానని రాహుల్ తెలిపారు. సహాయక, పునరవాస కార్యక్రమాలను ముమ్మరం చేసే విషయంపై కేరళ ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో మాట్లాడానని చెప్పారు.వరద బీభత్సంతో కేరళలో ఇప్పటికే 17 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో 200 మంది గాయపడ్డారు.