ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ తొలిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. గత ఏడాదిగా మేనిఫెస్టో పై కసరత్తు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో అన్ని వాస్తవాలే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలో అయిదు ముఖ్యాంశాలు పొందుపరచబడ్డాయన్నారు. హస్తం గుర్తును సూచించేలా అయిదు ముఖ్యాంశాలకు చోటు కల్పించామన్నారు.
* ఈ అయిదింటిలో ముఖ్యమైనది ‘న్యాయ్’ అని పేర్కొన్నారు. దేశంలోని 20 శాతం పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందిస్తామన్నారు.
* రెండో ముఖ్యాంశంగా ఉద్యోగ కల్పన గురించి ప్రస్తావించారు. మొత్తం 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాహుల్ తెలిపారు. యువకులు వ్యాపారం చేయాలనుకుంటే మూడేళ్లపాటు ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదని చెప్పారు.
* ఉపాధి హామీ పథకం 100 నుండి 150 రోజులకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ధనవంతులు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నారని, నిజమైన రైతులు బ్యాంకు లోన్ తీసుకొని కట్టకపోతే క్రిమినల్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇకపై రైతులు లోన్లు కట్టలేకపోతే క్రిమినల్ కేసులుండవని రాహుల్ స్పష్టం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 6 శాతం నిధులు కేటాయించామన్నారు.
* ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. గత అయిదేళ్లలో మోడి ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించిందని, తాము ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు.
* గతంలో హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు.