కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తాను వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నవిషయంపై స్పష్టత ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే అక్కడ నుండి పోటీకి దిగుతున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమను శత్రువులా చూస్తున్నారని దక్షిణాది ప్రజలు భావిస్తున్నారు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. వారికి నేను అండగా ఉంటా. ఆ సందేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నా.. అని రాహుల్ వెల్లడించారు. గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని, విభజనకు పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. ఐక్య భారతాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ పని చేస్తోందని తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేడు మేనిఫెస్టో విడుదల చేసింది. సంపద, సంక్షేమమే లక్ష్యంగా దేశంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసే విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్ కంచుకోట అయిన యూపీలోని అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ బరిలోకి దిగుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని ఆదివారం వెల్లడించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా దీన్ని ధ్రువీకరించారు. దీనిపై రాహుల్ నేడు మేనిఫెస్టో విడుదల సందర్భంగా స్పందించారు.