telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సాంకేతిక

తేజస్‌ యుద్ధవిమానానికి .. తొలి మహిళగా కోపైలట్‌గా సింధు ..

pv sindhu as first copilet for fighter plane

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరో ఇండియా విమెన్స్‌ డే వేడుకలలో భాగంగా నడిపారు. తేజస్‌కు కోపైలట్‌గా సింధు వ్యవహరించినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. వైమానిక రంగంలో మహిళలు సాధించిన అద్భుతమైన విజయాలను ఏరో ఇండియాలో ప్రదర్శించనున్నారు. మహిళా సిబ్బంది విమానాలను నడిపి తమ ప్రతిభను చాటుకున్నారు. తేజస్‌ యుద్ధవిమానానికి కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచారు. విమెన్స్‌ డే వేడుకల్లో భాగంగా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ కూడా తేజస్‌లో ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.

నేడు(శనివారం) ఏరో ఇండియాలో మహిళా పారాట్రూపర్లు చేసిన ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. మి17 విమానం నుంచి ఐదుగురు మహిళా పారాట్రూపర్లు జంప్‌ చేసి అందరి దృష్టిని తమవైపునకు తిప్పుకున్నారు. మహిళా పైలట్లు కూడా విమానాలను నడిపి తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఏవియేషన్‌ రంగంలో మహిళా సేవలను కీర్తిస్తూ వారి గుర్తుగా స్టాంపును విడుదల చేశారు.

బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌లో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా ఇటీవల తేజస్‌లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన విషయం తెలిసిందే. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ బుధవారమే వాయుసేనలో చేరింది. తేజస్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేసింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్‌ యుద్ధ సూట్లుతో పాటు పలు రకాల బాంబు, ఆయుధాలను కలిగి ఉండటం వంటి ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి.

Related posts