తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలిని ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తామని కొత్త ప్రభుత్వం ఈరోజు ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడి ఇరవైనాలుగు గంటలు కాకముందే పుట్టా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు పంపించారు.
వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ కొత్త చైర్మన్ గా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.