ఏపీ రాజధాని అమరావతి పై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని బీజేపీ నేత పురందేశ్వరి డిమాండ్ చేశారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సమీక్షతో రాష్ట్రంలో పెట్టుబడలు వచ్చే అవకాశం కనిపించడంలేదన్నారు.
రాజధానిపై నిర్ణయం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తక్షణమే రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. బీజేపీకి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ చివరికి సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. వయోభారంతో ఉన్న సోనియా గాంధీని అధ్యక్షురాలిగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.