కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఓ టెర్రరిస్టు దాడిలో 44 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో తమకు బుల్లెట్ఫ్రూఫ్ వాహనాలు, ఎక్స్ప్లొజివ్ డిటెక్టర్స్, అత్యంత అధునాతన పరికరాలు ఇవ్వాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కేంద్ర సర్కారును కోరింది.
ఉగ్రవాదుల ప్రాబల్యమున్న జమ్మూ, శ్రీనగర్, లేహ్ విమానాశ్రయాల్లో భద్రత కోసం సీఐఎస్ఎఫ్ కు అదనంగా 1200 మంది జవాన్లను నియమించాలని సూచించారు. దేశంలోని వంద విమానాశ్రయాల భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోంది. ఒక్కో విమానాశ్రయం బయట పెట్రోలింగ్ చేసేందుకు వీలుగా ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి కోరారు. విమానాశ్రయాల భద్రతపై సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఫర్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీతో కలిసి సెక్యూరిటీ ఆడిట్ జరిపారు.