మన పార్లమెంట్ సమావేశాలలో మైకులు విసురుకోటాలు.. గట్రా సన్నివేశాలు చూసే ఉంటారు కదా.. అలాంటి అద్భుత సన్నివేశాలు మనదేశంలోనే అనుకునేరు, మనల్ని చూశారో ఏమో వీళ్లు, మనల్ని మించిపోయారు. నేటి హాంకాంగ్ పార్లమెంటు రణరంగమైంది. ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి లోపలికి చొచ్చుకొచ్చిన నిరసనకారులు సభలో విధ్వంసం సృష్టించారు. అనుమానిత నేరగాళ్లను చైనాకు అప్పగించే విషయంలో గత మూడు వారాలుగా హాంకాంగ్ అట్టుడుకుతోంది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఆందోళన హింసకు దారి తీసింది.
నిరసనకారులు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటులోకి దూసుకెళ్లారు. ముసుగులు, హెల్మెట్లు ధరించి లోపలికి చొరబడిన నిరసనకారులు గోడలకు ఉన్న చిత్రపటాలను విసిరికొట్టారు. గోడలకు రంగులు పూసి నానా విధ్వంసం సృష్టించారు. అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.