మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీలో ఠానేకు చెందిన నిఖిల్ టిఖే పనిచేస్తున్నారు. ఈ కంపెనీ ఇటీవల ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరిని వేరే ప్రాంతానికి అక్రమ బదిలీ చేసింది. వీరిలో నిఖిల్ కూడా ఉన్నారు. దీంతో యాజమాన్యం తీరును నిరసిస్తూ నిఖిత్ సహా ఏడుగురు ఉద్యోగులు జులై 9 నుంచి అమరావతిలోని కంపెనీ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సమయంలోనే నిఖిల్కు పెళ్లి కుదిరింది. జులై 19న వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. దీంతో ధర్నాను విరమించి పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా నిఖిల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. దీంతో చేసేదేం లేక.. దీక్షా శిబిరం వద్దే వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ధర్నా వేదిక వద్ద మెహందీ, హల్దీ కార్యక్రమాలు నిర్వహించారు నిఖిల్ బంధువులు. రేపటి వరకు మనసు మార్చకోకపోతే పెళ్లి కూడా ఇక్కడే జరిపిస్తారని తెలిపారు. అటు నిఖిల్ మాత్రం సమస్య పరిష్కారమయ్యేంత వరకు దీక్షను కొనసాగిస్తానని చెబుతున్నారు.