మనకే కాదు ప్రతి ప్రాణికి తిండి, నిద్ర వంటివి చాలా అవసరం. తినే తిండి శరీరానికి సరైన శక్తి ఇచ్చేందుకు అవసరం అయితే, నిద్ర శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి ఓపిక ఒచ్చినట్టుగా అనిపిస్తుందో, సరైన నిద్ర పోయిన రోజు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. పగలంతా అలసిపోయిన శరీరానికి నిద్రపోవడం వలన మనిషి శరీరంలో నూతనోత్తేజాన్ని నింపుతుంది.
అదే శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఆ రోజు అలసటగా ఉంటుంది. దీనితో ప్రతి చిన్నవిషయానికి చిరాకు, కోపం వస్తుంది. దీనితో అటు పనిలో ఏకాగ్రత కుదరకపోవడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, మతిమరుపు వంటివి జరుగుతుంటాయి. అదే కంటినిండా నిద్రపోయినవారిలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది అంటున్నారు వైద్యులు.
కాబట్టి ఒకరోజు నిద్రలేకపోతే మనిషి ఒత్తిడికి లోనవుతుంటాడు. దీనితో ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందంటున్నారు వైద్యులు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరగడం, రక్తపోటు, శరీరం లావు పెరగడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందువలన రోజు ఆయా వయసులను బట్టి తగిన నిద్ర అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడిని అధిగమించాలంటే, కనీసం 8 గంటల నిద్ర అందరికి అవసరం అని వారు స్పష్టం చేస్తున్నారు. నిద్ర చాలా మందికి రావట్లేదు అనే సమస్య కూడా ఉంటుంది. అటువంటి వారు నిద్రకు ఉపక్రమించగానే కాసేపు ధ్యానంలో నిమగ్నమవటమో లేదా శ్వాసపై ధ్యాసపెట్టినా కూడా నిద్రలోకి జారుకుంటాం. నిద్రలేమికి తగిన ఆహారం తీసుకున్నా కూడా చక్కగా నిద్ర పడుతుంది. అంతేగాని నిద్రమాత్రలు గట్రా వాడరాదు. సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నా కూడా సరిపోతుంది. నిద్ర చక్కగా పోయిన వారి ముఖ సౌందర్యం కూడా చక్కగా ఇనుమడిస్తుంది.