ఏపీ ప్రభుత్వం రూ.210 కోట్లు చెల్లించాలంటూ నిర్మాత అశ్వనీదత్ కోర్టుకెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అమరావతిలో జరిగిన భూసమీకరణ అంశంలో ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కింద తాను 39 ఎకరాలు ఇచ్చానని, ఆ సమయంలో ఎకరం ధర రూ.కోటి 54 లక్షలు ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని నిర్ణయించిందని, దీంతో ప్రస్తుతం అమరావతిలో ఎకరం రూ.30లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని అశ్వనీదత్ తెలిపారు. తానిచ్చిన 39 ఎకరాలకు మొత్తం రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం తన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని, భూ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించిన తర్వాతే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వనీదత్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
previous post