కాంగ్రెస్ ఈస్ట్ యూపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి, అమేథి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై మరోసారి విమర్శలు గుప్పించారు. అమేథిలో కేంద్ర మంత్రి చీరలు, చెప్పులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆదివారం విమర్శించారు. ప్రజలకు తప్పుడు హామీలిస్తూ కానుకలు ఎర చూపుతున్నారని ప్రియాంక ఆరోపించారు. స్మృతి ప్రజలకు చెప్పులు పంచడం ద్వారా వారిని అవమానిస్తున్నారని అన్నారు. వాటిని ఆమెకే తిరిగి ఇచ్చాయాలని ప్రియాంక సూచించారు.
అమేథీ ప్రజలు ఎప్పుడూ ఎవరి ముందూ చేయచాపరని, ఆ అవసరం వారికి లేదని అన్నారు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల అమేథీ ప్రజలు చెక్కుచెదరని ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తున్నారని కొనియాడారు. అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున స్మృతి బరిలో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ రాహుల్తో పోటీ పడిన స్మృతి దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.