భారత్ లో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నిక జరగనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు .
పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఇవాళ పోలింగ్ జరుగనుంది ఈ ఎన్నికల్లో మొత్తం 4,800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ జరుగుతుంది.ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్ పై ఎంపీలు, గులాబీరంగు బ్యాలట్ పేపర్ పై ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24న ము గియనున్న నేపథ్యంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి నేడు ఎన్నికలు జరగనున్నాయి .ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేయనున్నారు.
ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల వెలువడనున్నాయి. ఎన్నికైన వ్యక్తి ఈ నెల 25వ తేదీన భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి.
దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు.
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు.
సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది.
ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది.
ఇదిలా ఉండగా, ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బీజేపీ నేతలకు సరికొత్త విధానంలో అప్పీలు చేసుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులు పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేయాలని అప్పీల్ చేశారు. దేశాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి, లౌకికత్వాన్ని రక్షించడానికి తనకు ఓటు వేయాలని కోరారు. ప్రత్యేకంగా బీజేపీ నేతలకు ఆయన ఒక అప్పీలు చేశారు. ఒకప్పుడు బిజెపికి చెందిన వాడినే అని గుర్తుచేసుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ సారధ్యంలో ఉన్న పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. అలాంటి వాతావరణం ఇప్పుడు బిజెపిలో లేదని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పడానికి బాధపడుతున్నారని వివరించారు
జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్