ఇంకా గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేకపోవటం దేశపరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తుంది. అంతకంటే అత్యవసరాలు కూడా అందని గ్రామాలూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు తీవ్ర రక్తస్రావం అవుతూ, అపస్మారక స్థితిలో ఉన్న ఓ గర్భిణీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ద్విచక్రవాహనంపై తరలించారు. ఈ సంఘటన ఝార్ఖండ్లోని చత్వాగ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శాంతిదేవి అనే గర్భిణీకి రక్తస్రావమై, అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో ఆమె భర్త కమల్ గంజు సమీపంలోని చండ్వా పీహెచ్సీకి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించడంతో పాటు 108 హెల్ప్లైన్కు ఫోన్ చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో వేరేదారి లేక ద్విచక్ర వాహనంపై అక్కడికి తరలించాడు.
ఆమెను పరీక్షించిన వైద్యులు లతేహర్ సదార్ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించడంతో మళ్లీ ద్విచక్రవాహనంపైనే తీసుకెళ్లారు. లతేహర్ వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు శాంతిదేవిని తీసుకెళ్లమని చెప్పి, అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్స్లో తీసుకెళ్లి రిమ్స్లో చేర్పించారు. లతేహర్ డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకున్నా ఆమెకు అంబులెన్స్ లభించలేదని, అనంతరం సదార్ ఆస్పత్రి వైద్యులు రక్తమార్పిడి చేసేందుకు నిరాకరించారని స్థానిక సీపీఎం నాయకుడు అయూబ్ఖాన్ ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ గర్భిణీని వైద్యులు మంచి వైద్యం పేరు చెప్పి ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అలా తిప్పడం సరైనది కాదని తప్పుబట్టారు. తమకు పీహెచ్సీతో అనుబంధంగా ఓ అంబులెన్స్, ఒక 108 వాహనంతో పాటు, గర్భిణీల కోసం మమత వాహనం కూడా అందుబాటులో ఉందని లతేహర్ ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్పీ శర్మ చెప్పారు. శాంతిదేవికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో విశేషమేమంటే ఇటీవల స్థానిక ఎంపీ 3 గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. వాటిలో ఈ చట్వాగ్ గ్రామం కూడా ఉండటం మరో విశేషం.