పరిస్థితులు ఎలా ఉన్నా దానికి తగ్గట్టు వెళ్లొచ్చు, అన్ని తగ్గట్టుగా మార్చుకోవచ్చు.. కానీ ఆహారం విషయంలో అలాంటివి ప్రయత్నిస్తే మాత్రం బాధపడక తప్పదు. ఇలా మార్పులు చేసుకొని.. అనవసరంగా బాధలు కొనితెచ్చుకున్న వాళ్ళు బోలెడుమంది ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా, రోగాలు వచ్చాక లక్షలు స్తొమత లేకున్నా.. అప్పులు చేసి.. అడ్డంగా మునిగిపోతున్నారు. దానికంటే ముందే మంచి ఆహారం తీసుకుంటే, అన్నివిధాలా జాగర్తగా ఉన్నవాళ్ళం అవుతాము అంటున్నారు నిపుణులు. ఇదే తరహాలో, మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి.
సాదారణంగా రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది. చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములలో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. ఆ కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది. వీటన్నికి విరుగుడు..
* తగినంత నీటిని త్రాగాలి. తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండ మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు పంపుతాయి.
* కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మనం తీసుకొనే ఆహారంలో కాల్షియం తక్కువైతే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అయిన అక్సలేట్ స్థాయిలు పెరిగిపోతాయి. ఆహారంలో తగినంత కాల్షియం తీసుకుంటే, మూత్రపిండాలకు వెళ్ళకుండా మరియు రక్తంలో కలవకుండ అక్సలేట్ ను ప్రేగుల్లో బందిస్తుంది.
* అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం శోషణ తగ్గి, అది కాల్షియం అక్సలేట్ గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడుతుంది.
* ఉప్పు తీసుకోవటం తగ్గించాలి. సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మూత్రంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. శరీరంలో అదనపు సోడియంను బయటకు పంపటం మూత్రపిండాలకు కష్టమైన పనిగా మారుతుంది.
* సోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలు త్రాగకూడదు. సోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలకు మూత్రపిండాలలో రాళ్ళకు సంబంధం ఉంది.