సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయాల పాలైన ప్రకాష్ రాజ్ చేతికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ చికిత్స తరువాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు.
దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారీత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ కోసం దర్శకుడు మణిరత్నం, నటుడు కార్తీ, ప్రకాష్రాజ్ తదితరులు గ్వాలియర్ నగరానికి వెళ్లారు. అక్కడ మణిరత్నం, కార్తీలతో దిగిన ఫొటోలను నటుడు ప్రకాష్రాజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గ్వాలియర్ విమానాశ్రయంలో దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ మరియు ప్రకాష్ రాజ్ చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన క్లాసిక్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా రెగ్యులర్ అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ప్రభు, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2022 లో విడుదల కానుంది.
“పొన్నియిన్ సెల్వన్”ను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ల కింద అల్లిరాజా సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.