మమ్మల్ని వెలివేశారు అంటూ ఎనిమిదేళ్ల చిన్నారి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే ఆ బాలిక తన తండ్రి, తాతలను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమను వెలివేశారని లేఖలో పేర్కొంది. ఈ కథనాలు పలు దినపత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి. తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు విన్నవించుకుంది.
తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.