ఏపీ రాజధానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో గత సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజావేదికలోని ఏసీలు, మైకులు, ఇతర సామగ్రిని తరలించారు. జేసీబీల సాయంతో ప్రజావేదిక ప్రహరీగోడను కూల్చివేస్తున్నారు. అంతకుముందు, అక్కడి క్యాంటీన్ ను కూల్చివేశారు. ప్రజావేదిక దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రజావేదిక, కరకట్టను భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతను సీఆర్డీఏ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెల్లవారే సరికి ప్రజావేదిక నేలమట్టం కానుంది.
ప్రజావేదికను కూల్చాలని ప్రస్తుత ఏపీసీఎం ఆదేశాలు ఇస్తే, దానిని తక్షణం ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం అర్ధ రాత్రి 2:30 గంటలు దాటిన తర్వాత కూడా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు కొనసాగాయి. పిల్ విచారణ చేపట్టిన జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్లు అడ్వకేట్ జనరల్ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డిల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరిస్తూ కేసును రెండు వారాలు వాయిదా వేసింది.
వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి