తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర ఏకంగా రూ. 257కు చేరుకుంది. గతంలో ఏ వేసవిలోనూ ధరలు ఈ స్థాయికి చేరుకోలేదు. ఒక్కసారి మాత్రం రూ. 246కు చేరుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఈసారి ఆ రికార్డు బద్దలైంది. చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకార్లతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ఫలితంగా తెలంగాణలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది.
మరోవైపు, ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో కోళ్లు తక్కువ బరువు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో చికెన్ ధరల పెరుగుదలకు ఇదే కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. నిన్న కోళ్ల ఫారాల వద్ద లిఫ్టింగ్ ధర రూ.140గా ఉండగా, నేడు అది రూ. 145కు చేరింది. ఈ లెక్కన చూసుకుంటే కిలో చికెన్ ధర రూ. 260 దాటే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది.