నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. కారు డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ వంద అడుగుల రహదారి మలుపు వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి ఒక వ్యక్త్తి కారును వదిలేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. ఈ ఫుటేజీని పరిశీలించిన స్థానికులు పారిపోతున్న వ్యక్తి సినీహీరో రాజ్తరుణ్ అని అనుమానించారు. కాని ఆ కారు రాజ్తరుణ్ది కాదని, అందులో ఆయన లేరని, ఇంట్లోనే ఉన్నారంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు టీఎస్ 09 ఈఎక్స్ 1100 నెంబర్ ఉన్న కారు, లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదని, ప్రదీప్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నట్టు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కారులో ఉన్న వ్యక్తి హీరో రాజ్ తరుణ్ అని నిర్ణయించారు. సుమోటో కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రాజ్ తరుణ్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో రాజ్ తరుణ్ తో పాటు, నిర్మాత రామ్ తాళ్లూరి కూడా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఎవరు నడిపారు అనే దానిపై సమాచారం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిద్రమత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపారా లేక రాజ్ తరుణ్ మద్యం సేవించాడా అనే అనుమానాలకు సమాధానం తెలియాలంటే రాజ్ తరుణ్ స్పందించాల్సిందే.
previous post